తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలోని శివుని విగ్రహాన్ని కపిలమహాముని ప్రతిష్ఠించినందుకు ఈ తీర్థానికి కపిలతీర్థం అని పేరు వచ్చింది. ఈ ఆలయం తిరుమల కొండకు దిగువ భాగాన ఒక గుహను ద్వారంగా చేసుకుని గుహాలయంగా విరాజిల్లుతూ ఉంది. కొండనుంచి జాలువారేనీళ్లు నేరుగా ఈ కపిలతీర్థ పుష్కరిణిలో పడుతుంది. కాబట్టి ‘కపిలతీర్థం’ అని పిలువబడుతుంది. దీనినే ‘ఆళ్వార్ తీర్థం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ముందు ఒక పెద్ద రాతి నంది విగ్రహం శివుడికి ఎదురుగా భక్తులకు దర్శనమిస్తుంది.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం, కపిలముని ఇక్కడ తప్పసు చేసినప్పుడు శివ-పార్వతులు అతని తప్పసుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమయ్యారట. ఇక్కడ ఉన్న శివలింగం ‘స్వయంభు’ అని చెప్పబడుతున్నది.
Also Read:KTR:కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి
కపిలేశ్వరస్వామి ఆలయం దెగ్గరలో నమ్మాళ్వార్ గుడి కూడా ఉంది. కనుక ఈ తీర్థాన్ని ‘ఆళ్వార్ తీర్థం’ అని అంటారు. ఈ ఆలయంలో కపిలేశ్వరస్వామి ఆలయంతోపాటు కామక్షమ్మవారి ఆలయం, వినాయకస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, దక్షిణమూర్తిస్వామి ఆలయం, నటరాజస్వామివారి ఆలయం, కోటిలింగేశ్వరస్వామి ఆలయం, అగస్తీశ్వరస్వామి ఆలయం, నవగ్రహాలయాలలో శైవాగమం ప్రకారం పూజలు నిర్వహిస్తుండగా ఆలయప్రాంగణంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం పాంచరాత్ర ఆగమానుసారం శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, అభయహస్త ఆంజనేయస్వామి ఆలయాలలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.

