తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

102
ttd
- Advertisement -

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది టిటిడి.. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో పరిమిత సంఖ్యలోనే టిటిడి అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు..

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు.. ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు,శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంను ఇవాళ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు.. ఏడాదిలో ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు.. సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన పరిమళాన్ని స్వామి వారికీ సమర్పించి,ఆలయ గోడలపై పూతగా పూయడం జరిగిందన్నారు.. ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారికి నైవేద్యం సమర్పణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తాంమన్నారు.. వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం పొంది భక్తులు రేపు తిరుమలకు చేరుకుని ఉండాలని, ఈక్రమంలో టిటిడి పాలకమండలి నిర్ణయం మేరకు నేటి నుండి గదుల కేటాయింపును తిరుమలలో తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.. ఇవాళ స్వామి వారి దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తామన్నారు.. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే స్వర్ణరథం ఊరేగింపుకు 200 మంది టిటిడి మహిళా ఉద్యోగుల ద్వారా స్వర్ణరథం లాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు..

- Advertisement -