తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశ్తో పాటు మిగిలిన విగ్రహాలన్నీ నేడే గంగమ్మ ఒడికి చేరనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా శోభాయాత్ర కన్నుల పండువుగా సాగుతోంది. ట్యాంక్బండ్ ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
ఖైరతాబాద్లోని పంచముఖ మహాలక్ష్మి గణపతి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్తున్నాడు. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. మహాగణపతిని తరలించడానికి 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణతి సెన్షెన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్బండ్పైకి చేరుకోనున్నారు. మొత్తం 2.5 కిలోమీటర్ల పొడవు సాగనున్న శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 4 వద్ద ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు గణపయ్య నిమజ్జనం పూర్తికానుంది.