కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.
2020 అక్టోబర్ 23న సినిమా విడుదలకానుందని కరోనాకు ముందు ప్రకటించింది చిత్రయూనిట్. కరోనా కారణంగా విడుదల తేదీని వాయిదా వేస్తారో లేదో తెలియదుగాని తాజాగా టీజర్కు సంబంధించి అప్ డేట్ ఇచ్చేశారు.
ప్రస్తుతం సినిమా టీజర్ని రిలీజ్ చేసే ప్రణాళికలు ఏమి లేవని..రిలీజ్కు ముందే ట్రైలర్ లాంఛ్ అవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు. తెలుగులో సాయి కొర్రపాటి విడుదల చేస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా కీ రోల్ పోషిస్తున్నారు.