త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. శాసనసభలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు అధికార టీఆర్ఎస్కే ఉన్నాయి. దాంతో మూడు రాజ్యసభ స్థానాలు టిఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశముంది. అయితే అందులో ఒక సీటును గతంలో సీఎం కేసీఆర్, యాదవ సామజిక వర్గానికి చెందిన నేతకు ఇస్తానని యాదవ మహాసభ సాక్షిగా హామీ ఇచ్చారు. మూడు సీట్లలో ఒక సీటు యాదవులకు కేటాయించడంతో మిగిలిన రెండు సీట్లను ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఇప్పుడు టీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. మిగిలిన రెండు సీట్లలో ఒక సీటును టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇచ్చేఅవకాశమున్నట్టు తెలుస్తోంది.
సంతోష్ కుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉంటున్నారు. సంతోష్ కుమార్ అందరికి చిరపచితుడే. ఆయన వ్యవహారమంతా తెరవెనకే ఉంటుంది. అధినేత కేసీఆర్ ప్రతి అడుగులోనూ ఆయన ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం కేసీఆర్ నీడ సంతోష్ కుమార్. ఉద్యమ కాలంలోనే కాదు.. ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగేళ్లలో సంతోష్ కుమార్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. సంతోష్ కుమార్ మిత భాషి, మాటలు తక్కువ, చేతలు ఎక్కువన్నట్టుగా ఒక్క స్మైల్ తోనే అన్ని సెట్ చేస్తారన్నపేరుంది.
ఇంతకాలం కేసీఆర్కు నమ్మిన బంటుగా విధేయుడిగా, తన పూర్తి సమయాన్ని కేటాయించారు సంతోష్ కుమార్. ఉద్యమంలో పైకి కనిపించని భాగస్వామ్యాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంతోష్ కుమార్ ఎటువంటి అధికారిక పదవిలో కొనసాగలేదు. కేవలం తెరవెనుక ఉండి మాత్రమే పనులను పూర్తి చేశారు. తాజాగా త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల్లో సంతోష్ కుమార్కు ఒక సీటును ఇవ్వాలనే యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. సంతోష్కుమార్ను రాజ్యసభకు ఎంపిక చేస్తే పార్టీకి ప్రయోజనకరమన్న డిమాండ్ వినిపిస్తోంది.
సంతోష్ కుమార్ ను రాజ్యసభకు పంపిస్తే ఆది నుండి సీఎం కేసీఆర్కు నీడలా పనిచేసిన నేతకు న్యాయం లభించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ పార్టీకి.. ప్రభుత్వానికి మరింత ప్రయోజనం కలుగుతుందన్న చర్చ జరుగుతోంది. సంతోష్ కుమార్ ను రాజ్యసభకు పంపించాలని ఇటు రాష్ట్ర మంత్రి కేటీఆర్, అటు ఎంపీ కవితలు సీఎం కేసీఆర్కు సూచించినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మార్చి రెండవ వారంలోనే తెరాస తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అందులో జోగినపల్లి పేరు కూడా ఉండే అవకాశమున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.