KCR:అంబేద్కర్‌ని అవమానిస్తే చూస్తూ కూర్చుందామా?

10
- Advertisement -

తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన జ‌హీరాబాద్, మెద‌క్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.మెదక్‌ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు.

‘‘అంబేడ్కర్‌ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురుగా 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం. ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనేలేదు. కనీసం పూలు పెట్టలేదు..నివాళులర్పించలేదు. నేను నిర్మించానని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లలేదు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా! యాదాద్రి ఆలయం నేనే నిర్మించా.. మూసేస్తారా? అని ప్రశ్నించారు.

అంబేడ్కర్‌ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా? అవమానించిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్నారు. నాలుగు నెలలు గడిచినా చేయలేదు. మళ్లీ.. ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయాలి. దీని కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్‌ కోసం పోస్టుకార్డు ఉద్యమం చేయాలి.హామీలు అమలు చేయాలని అడిగితే బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ప్రజాస్వామ్యంలో బాగా ఆలోచించి ఓటు వేయాలి. మేం కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతులు ఇవాళ ఆగం అయ్యారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సాగుకు కరెంటు లేదు. కాంగ్రెస్‌ ఐదేళ్లు అధికారంలో ఉండాలి, అప్పుడే మంచి.. చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రే జంప్‌ కొడతారేమో తెలియదు. బీజేపీకి ఓటు వేసినా.. మంజీరా నదిలో వేసిన ఒకటే. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం, దాన్ని వదిలేసుకోవాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

Also Read:ఆకు కూరలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

- Advertisement -