ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్..

92
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌ రావు కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు.. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా.. ఆ యూనిట్ ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు.

దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చున్నారని మంత్రి గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్ & సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నాం. వంద పడకల లోపు హాస్పిటల్ ను ఒక కేటగిరిగా.. వంద పడకలకు పైగా ఉన్న హాస్పిటల్ ను మరో కేటగిరి గా విభజించాం. ఏయే ఆస్పత్రులను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించామన్నారు. మొత్తం 56 హాస్పిటల్ లను దళితులకు కేటాయించడం జరిగింది. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్లు నిబంధనల్లో మార్పులు చేశాం. ఒక్క టెండర్ వచ్చిన పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు.

ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం ఒక్కో బెడ్ కు ఇచ్చే చార్జీలను రూ.5000 నుంచి రూ. 7500 కు పెంచడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఏటా రూ.325 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నది. డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశాం. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, DPH శ్రీనివాస్ రావు, DME రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డి గంగాధర్ తో కలిసి డ్రా ద్వారా హాస్పిటళ్ళను ఎంపిక చేశారు.

- Advertisement -