కాళేశ్వరం ప్రాజెక్టు..కంప్లీట్ డిటెయిల్స్‌

725
kaleshwaram project cm kcr
- Advertisement -

తెలంగాణ భూభాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగుకు, తాగుకు, పరిశ్రమలకు నీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. మానవ నిర్మిత అద్భుతంగా నిలుస్తుందని సి.డబ్ల్యు.సి. అధికారుల నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నీటి పారుదల నిపుణులు కితాబిచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే శరవేగంగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకం.

మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలో మీటరుకు పైగా ఎత్తుకు లిప్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టి.ఎం.సి.లను ఎత్తిపోయడానికి అనువుగా పంపుహౌజులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రతీ రోజు మూడు టిఎంసిల చొప్పున ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున నీటిని లిప్టు చేయడానికి దేశంలో గతంలో ఎన్నడూ వాడనంత పెద్ద సైజు పంపులను వాడుతున్నారు.

2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది.2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

మూడేళ్ళ స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు,పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజిలు నిర్మించారు. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను కూడా ఈ నీటితో నింపుతారు. దీంతో తెలంగాణలో మొత్తంగా 199 కిలో మీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది.

కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా నీరందివ్వనున్నారు. దీంతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరించబడతాయి. అంటే మొత్తంగా తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ప్రతీ ఏడాది రెండు పంటలకు నీరందుతుంది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుంది. మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి 7,152 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుందని అంచనా వేశారు. దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు.చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పంపులు (ప్యాకేజీ 8 – రామగుడు) వాడుతున్నారు. భారతదేశంలో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యాంశాలు

() నీటిని సరఫరా చేసే మార్గం పొడవు- 1,832 కి. మీ.
() గ్రావిటీ కెనాల్-1,531 కి.మీ
() సొరంగ మార్గాలు-|203 కి.మీ.
() ప్రెషర్ మెయిన్స్/డెలివరీ మెయిన్స్-98 కి.మీ.
()లిప్టులు-20
() పంపు హౌజ్ లు-19
() అవసరమయ్యే విద్యుత్తు- 4,992.47 మె. వా.
() జలాశయాలు – 19
() జలాశయాల నిల్వ సామర్థ్యం – 141 టి.ఎం.సి.లు

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపాదిత జలాశయాలు

()100 మీ ఎఫ్ ఆర్ ఎల్ తో మేడి గడ్డ బ్యారేజీ- 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()119 మీ ఎఫ్ ఆర్ ఎల్ తో అన్నారం బ్యారేజీ -10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()130 మీ ఎఫ్ ఆర్ ఎల్ తో సుందిళ్ళ బ్యారేజీ-8.83 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()మేడారం జలాశయం- 0.78 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()అనంతగిరి జలాశయం- 3.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
() శ్రీ రంగనాయక సాగర్ జలాశయం (ఇమాంబాద్) – 3.00 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయమ (తడ్కపెల్లి) – 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()మల్కపేట జలాశయం- 3.00 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()618 ఎఫ్.ఆర్.ఎల్. తో కొండ పోచమ్మ సాగర్(పాములపర్తి)-15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
() గంధమల్ల జలాశయం- 9.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
() బస్వాపురం జలాశయం- 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
() భూంపల్లి జలాశయం-0.09 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
() కొండెం చెరువు-3.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()తిమ్మక్కపల్లి జలాశయం- 1.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
() దంతేపల్లి జలాశయం-1.00టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()ధర్మారావు పేట చెరువు-0.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()ముద్దిజివాడి చెరువు-0.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()కాటేవాడి చెరువు-0.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
()మోతే జలాశయం- 1.00 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలో మీటర్ల మేర సొరంగాల పనులు రాత్రింబవళ్లూ సాగుతున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిప్టుల వారీగా పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ పంపులు భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అత్యధిక విద్యుత్ సరఫరా అందించడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడంలో విద్యుత్ శాఖకున్న ప్రాధాన్యాన్ని మొదట్లోనే గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ శాఖ చరిత్రలో మొదటి సారిగా ట్రాన్స్ కో లో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్ (సూర్యప్రకాశ్)ను నియమించారు. జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు. ఆస్టియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బిహెచ్ఇఎల్ తో ఒప్పందం చేసుకుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు.

- Advertisement -