తెలంగాణ హైకోర్టు జేసీగా హిమ కోహ్లీ నియామకం..

483
Justice Hima Kohli
- Advertisement -

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా, నూతన న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది.

ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం తీర్మానించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా హిమ కోహ్లీ నియమితులయ్యారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్‌లో ‘లా’ పూర్తి చేశారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుప్‌ కుమార్‌ గోస్వామీ నియమితులయ్యారని సమాచారం.

- Advertisement -