యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త రియాలిటీ షోతో ప్రేక్షకులని అలరించనున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ గతంలో నాగార్జున, చిరంజీవి అలరించిన విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోకు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించనున్నాడు. అలాగే, ఈ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం కానుంది.
ఇందుకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లు ఇటీవలే ప్రచారం జరిగింది. అయితే, దీనిపై ఈసారి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రోజు విడుదల చేసిన ప్రోమోలో చైర్లో హోస్ట్ కూర్చుని ఉన్నాడు. అయితే, ఆయన ముఖాన్ని నేరు చూపకుండా నీడలా చూపించారు. దాన్ని గమనించి చూస్తే ఎన్టీఆర్ ఆ కుర్చీలో కూర్చున్నట్లు అర్థమవుతోంది.
‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు సంబంధించిన ప్రోమోల షూటింగ్ కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రోమో త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు రిలీజ్ అవుతుంది.