ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..

26
- Advertisement -

5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులతో పాటు 12 అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది. ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ రైల్వే, ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో, దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో, విద్యుత్‌ శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోలింగ్‌ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్‌ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్ ఓటు వేయొచ్చు అని వెల్లడించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 60(సీ) కింద ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొంత మందికి మాత్రమే బ్యాలెట్ ఓటు వేసే అవకాశం ఉండేది. ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్వీసు ఓటర్లు(సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు.

Also Read:TTD:మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

కానీ ఈసారి ప్రయోగాత్మకంగా 40 శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. జర్నలిస్టులు, అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

నోడల్‌ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. బ్యాలెట్ ఓటు వేయదలిచిన వారు దానిని నింపి స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందని.. నవంబర్‌ 7 నాటికి దరఖాస్తులు రిటర్నింగ్‌ అధికారికి చేరితే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

- Advertisement -