ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని…ప్రస్తుతం “ఓట్లు మరియు సీట్ల దొంగతనం జరుగుతోందని జైరాం రమేష్ ఆరోపించారు. అయోధ్య రామ్ జన్మభూమి విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావిస్తూ… ఈ ‘ట్రిపుల్ ఇంజన్’ ప్రభుత్వంలో ఓట్ల దొంగతనం, సీట్ల దొంగతనం, విరాళాల దొంగతనం జరుగుతున్నాయని విమర్శించారు.
ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ‘SIR’ ప్రక్రియకు సంబంధించిన లోపాలను ఈ లేఖలో ప్రస్తావించాం. ప్రస్తుతం జరుగుతున్న ఓట్లు, సీట్ల దొంగతనం గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. ఒకప్పుడు మన ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్నది” అన్నారు.
ఎన్నికల ఫలితాలు ముందే ఖరారవుతున్నాయనే భావన ప్రజల్లో ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు ముందే ఫిక్స్ అవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు… మన రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో పడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితాలు ముందే నిర్ణయించబడితే, ఇక ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏంటి? అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ… ఆయన కపటత్వంతో వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం నడుచుకుంటోందని ఆరోపించారు. “జ్ఞానేష్ కుమార్ కపటత్వానికి లోనైనట్లు కనిపిస్తోంది… పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర మరియు హర్యానాలో ఆయన ప్రవర్తన చూస్తుంటే, ఎన్నికల సంఘం హోంమంత్రి, ప్రధానమంత్రి నుండి ఆర్డర్లు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది” అని ఆయన ఆరోపించారు.
అయోధ్యలో జరుగుతున్న దర్యాప్తును ప్రస్తావిస్తూ, “మరోవైపు అయోధ్యలో విరాళాల దొంగతనం కూడా జరుగుతోంది. ఓట్ల దొంగతనం, సీట్ల దొంగతనం, విరాళాల దొంగతనం ఒకేసారి జరిగే ‘ట్రిపుల్ ఇంజన్’ ప్రభుత్వం ఇది” అని ఎద్దేవా చేశారు. ఈ విషయమై కూటమి పార్టీలు సంయుక్తంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. కూటమిలోని ప్రధాన పార్టీలు జరిపిన ముమ్మర చర్చల తర్వాత ఈ సంయుక్త లేఖపై డీఎంకే, ఆప్ పార్టీల నేతలు సంతకాలు చేసినట్లు సమాచారం.

