Jagan:రాయి దాడి.. జగన్ సెల్ఫ్ గోల్?

18
- Advertisement -

ఎన్నికల వేళ వైఎస్ జగన్ అమలు చేసే వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయి, గత ఎన్నికల టైమ్ లో గెలుపు కోసం ఆయన అనుసరించిన వ్యూహాలు వేసిన ప్రణాళికలు పార్టీని గెలుపు దిశగా నడిపించాయి. మరి ముఖ్యంగా ఒక్క ఛాన్స్ అంటూ ఆయన అందుకున్న నినాదం ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత వివేకా మర్డర్ విషయంలో ఎన్నికల ముందు జగన్ చూపిన డైవర్షన్, ఆ తర్వాత కోడి కత్తి పరిణామం ఇవన్నీ కూడా జగన్ కు బాగానే ప్లేస్ అయ్యాయి. ఇవన్నీ ప్రజల్లో జగన్ పేరు తరచూ మారు మ్రోగేలా చేశాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం దక్కింది. 2024 వచ్చే సరికి గతంలో అనుసరించిన వ్యూహలే ఆయనకు ప్రతికూలంగా మారుతూ వస్తున్నాయి..

గత ఎన్నికలో ముందు జరిగిన వివేకా మర్డర్ పరిణామం ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉండడంతో జగన్ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే భావన ప్రజల్లో గట్టిగానే ఏర్పడింది. అంతే కాకుండా గత ఎన్నికల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కోడి కత్తి ఎటాక్ కూడా జగన్ సానుభూతి కోసం చేయించుకున్నారనే వాదన బలపడింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల ముందు జగన్ అనుసరిస్తున్న వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగిన సంగతి విధితమే. అయితే ఈ దాడి ఎవరు చేశారు ? ఎందుకు చేశారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కేసు విషయంలో దర్యాప్తు జరుగుతున్నప్పటికి ఈ ఎటాక్ ను పార్టీని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఎందుకంటే సి‌ఎం స్థాయి వ్యక్తికి కనీసపు భద్రత ‘ఎందుకు కొరవడింది ? అనే అనుమానంతో పాటు జగన్ కు తగిలిన చిన్న దెబ్బకు వైసీపీ ఎందుకింత రాద్దాంతం చేస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సానుభూతి కోసం జగన్ మరోసారి తనపై తానే ఎటాక్ చేయించుకున్నారనే వాదన కూడా అడపా దడపా వినిపిస్తోంది. దీంతో ఈసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల ముందు జరిగిన పరిణామాల మాదిరిగానే ఈసారి ఎన్నికల సమయంలో కూడా జగన్ పై ఎటాక్ జరగడంతో ప్రజల్లో ఈ వ్యవహారం అంతా జగన్ కు వ్యతిరేకంగా మారుతోందనేది కొందరి అభిప్రాయం. మరి ఎన్నికల్లో ఈసారి జగన్ కు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.

Also Read:బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్

- Advertisement -