మహిళా బిల్లుతో వచ్చే మార్పేంటి?

40
- Advertisement -

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం ఖాయమైంది. దేశంలో లింగ విభేదం లేకుండా చట్టసభల్లో స్త్రీ పురుషులకు సమానమైన హక్కులు కల్పించడమే మహిళా రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 2010లో ఈ బిల్లుపై రాజ్యసభ ఆమోదం లభించినప్పటికి లోక్ సభ మాత్రం ఆమోదించలేదు. ఇక గత కొన్నాళ్లుగా ఈ మహిళా బిల్లు పై బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పోరాటానికి తలొగ్గిన కేంద్రం బిల్లుకు మద్దతివ్వడం హర్షించాల్సిన విషయం..

అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకొనున్నాయి అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే బిల్లు ఆమోదం పొందితే రాజ్యాంగం ప్రకారం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. అంటే 545 లోక్ సభ స్థానాలు ఉన్న పార్లమెంట్ లో 179 సీట్లు మహిళల కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల ప్రకారం మహిళల కోసం సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.

ఏపీ లో 175 స్థానాలకు గాను 58 స్థానాలు, తెలంగాణలో 119 స్థానాలకు గాను 39 స్థానాలు మహిళలకు ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చట్ట సభల్లో పురుషుల ఆధిక్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళల హవా మెరుగు పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. మరి ఈసారి ఎన్నికల వేళ మహిళా అభ్యర్థుల కోలాహలం పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి మహిళా రిజర్వేషన్ బిల్లు సార్థకతలో ఎంతగానో కృషి చేసిన బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరాటం నిజంగా ప్రశంశనీయం.

Also Read:టీమిండియా ప్రయోగాలు ఫలిస్తాయా?

- Advertisement -