నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ర్యాలీలో నిబంధనలను అతిక్రమించి జనాన్ని లోపలికి అనుమతించాలని ప్రయత్నించిన పార్టీ నేతను బహిరంగంగా అడ్డుకున్న ఐపీఎస్ అధికారి ఈషా సింగ్కు బదిలీ అయ్యింది. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన తొలి బహిరంగ సభ పుదుచ్చేరి ఉప్పళం ఎక్స్పో గ్రౌండ్లో జరిగింది. ఈ సభకు పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. హాజరయ్యే వారి సంఖ్యకు పరిమితి పెట్టడంతో పాటు రోడ్షోలను పూర్తిగా నిషేధించారు.
అయితే టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ వేదికపైకి వచ్చి, సభా ప్రాంగణంలో ఇంకా స్థలం ఉందని, మరింత మంది లోపలికి రావచ్చని ప్రకటించగానే ఈషా సింగ్ వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన మాట మధ్యలోనే మైక్ను తీసుకుని ప్రసంగాన్ని ఆపేశారు.
మీకు ఎంతమంది రక్తం చేతుల మీద ఉందో తెలుసా? నలభై మంది చనిపోయారు. మీరు ఏం చేస్తున్నారు? అంటూ నిర్వాహకులను ఆమె తీవ్రంగా మందలించారు. అనుమతించిన పరిమితిని మించి ఎవరినీ లోపలికి అనుమతించబోమని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సెప్టెంబర్ 28న జరిగిన కరూర్ తొక్కిసలాటను గుర్తు చేస్తూ ప్రజలకు గట్టి హెచ్చరికగా మారాయి. ఆనంద్ నుంచి మైక్ లాక్కుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. రాజకీయ ఒత్తిడికి లొంగకుండా నిబంధనలు అమలు చేసినందుకు ఈషా సింగ్ను నెటిజన్లు ప్రశంసించారు.
1998లో ముంబైలో జన్మించిన ఈషా సింగ్ ప్రజాసేవకు అంకితమైన కుటుంబంలో పెరిగారు. ఆమె తండ్రి యోగేష్ ప్రతాప్ సింగ్ 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అవినీతిని బయటపెట్టిన కారణంగా పదే పదే శిక్షాత్మక బదిలీలు ఎదుర్కొని చివరకు రాజీనామా చేశారు. ఆమె తల్లి అభా సింగ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ను వదిలి న్యాయవాదిగా మారి, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు వంటి కీలక ప్రజాహిత వ్యాజ్యాలను వాదించారు.
Also Read:మోడీ అంటే ఇష్టం అంటూనే..భారత్కు ట్రంప్ హెచ్చరిక!

