అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం తనకి ఎంత అచ్చొచ్చిన వేదిక అని శుభ్మన్ గిల్ మరోసారి నిరూపించాడు. ఈ మైదానంలో 27 ఇన్నింగ్స్ల్లో 10వ సారి యాభైకి పైగా పరుగులు సాధించిన గిల్, కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై తన జట్టుకు 5 వికెట్ల విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 180కి ఆలౌట్ కాగా గుజరాత్ టైటాన్స్.. 19.4 ఓవర్లలో 181/5 పరుగులు చేసి వికెట్లు టార్గెట్ని చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్ అయ్యాడు. రబడా తన పదునైన బౌలింగ్తో రఘువంశీ, సీఫెర్ట్లను పెవిలియన్కు పంపాడు. కేకేఆర్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోవ్మన్ పావెల్ కొన్ని మెరుపులు మెరిపించగా, కామెరాన్ గ్రీన్ నిలకడగా ఆడాడు. గ్రీన్ 55 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అయితే చివరి ఓవర్లలో వికెట్లు వరుసగా పడటంతో కేకేఆర్ 180 పరుగులకే పరిమితమైంది.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు గిల్ మరియు సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 5 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటించారు. సుదర్శన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన జోస్ బట్లర్ ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బట్లర్ అవుట్ అయినా, గిల్ తన జోరును కొనసాగించాడు. గిల్ 50 బంతుల్లో 86 పరుగులు చేసి విజయానికి చేరువగా తీసుకెళ్ళాడు. చివర్లో గిల్ అవుట్ అయినా, గ్లెన్ ఫిలిప్స్ మరియు షారూఖ్ ఖాన్ జట్టును గెలిపించారు.
Also Read:KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా

