ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. తాజాగా గుడ్ న్యూస్ వినిపించింది. సిక్కా రాజీనామా, ఆ తర్వాత శేషసాయి లేఖ.. ఇలాంటి వివాదాలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ఇన్ఫో…వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది.
ఇక ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలున్నా అమెరికా, యూరోపియన్ మార్కెట్లో ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
‘నియామక ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ ఏడాది కొత్తగా ఆరు వేలమందికి ఉపాధి కల్పించనున్నాం. వచ్చే రెండేళ్లలో కూడా ఇదే విధంగా నియామకాలు ఉంటాయి. అయితే అవి కంపెనీ వృద్ధిని బట్టి ఉంటాయి’ అని సంస్థ తాత్కాలిక సీఈవో, ఎండీ ప్రవీణ్ తెలిపారు. ఏటా 10లక్షల మంది గ్రాడ్యుయేట్ లు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, వీరిలో కేవలం 20-30శాతం మంది మాత్రమే ప్రతిభ కలిగిన వారు ఉంటున్నారని ఆయన చెప్పారు. అలాంటి వారి కోసం తమతో పాటు, ఇతర కంపెనీలు పోటీపడతాయన్నారు. జూన్ 2017 నాటికి ఇన్ఫోసిస్ లో మొత్తం 1,98,553మంది ఉద్యోగులున్నారు.
కొన్ని నెలులుగా ఇన్ఫోసిస్ లో వివాదాలున్నాయి. ముఖ్యంగా 200 మిలియన్ డాలర్లు వెచ్చించి పనయా కొనుగోలుకు సంబంధించిన విషయంలో.. వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో సీఈవో విశాల్ సిక్కా, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆర్.శేషసాయి సహా ముగ్గురు బోర్డు సభ్యులు సంస్థను నుంచి తప్పుకున్నారు.