హైదరాబాద్–జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఇండోనేషియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ భేటీలో డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి.
ఇండోనేషియా చేపడుతున్న డిజిటల్ ప్రాజెక్టులకు తెలంగాణ సాంకేతిక సహకారం అందించాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణ టెక్ టాలెంట్ను ఇండోనేషియా అవసరాలకు అనుసంధానం చేసే విధంగా స్కిల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి తెలంగాణ అనుభవాన్ని పంచుకోవాలని ఇండోనేషియా ప్రతినిధులు అభ్యర్థించారు.
అలాగే తమ ‘నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప్’ అమలులో సాంకేతిక సహాయం కోరారు. AI వినియోగంలో నైతిక ప్రమాణాల రూపకల్పన, డేటా గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో తెలంగాణ సహకారం కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ భాగస్వామ్యంతో హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మరింత ప్రతిష్ఠను పొందడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ ఐటీ రంగానికి కొత్త అవకాశాలు దక్కే అవకాశముంది.
Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

