రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం..

299
TeamIndia
- Advertisement -

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఇంగ్లండ్ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ సేన 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కోహ్లీ (73 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం ఈ మ్యాచ్ గెలుపులో కీలకంగా మారింది. అంతకుముందు టీమిండియా టాస్ గెలిచి ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. జాసన్ రాయ్ (46), కెప్టెన్ మోర్గాన్ (28) రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ సుందర్, పేసర్ శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ పడినా… తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న ఇషాన్ కిషన్ ధాటిగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ సైతం దూకుడుగా ఆడి 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సమయోచిత అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోనే మార్చి 16న జరగనుంది.

- Advertisement -