రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 234 పరుగులకు డిక్లేర్..

158
- Advertisement -

కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ 65 పరుగులు చేయగా, వృద్ధిమాన్ సాహా 61 (నాటౌట్) పరుగులు సాధించాడు. అశ్విన్ 32, అక్షర్ పటేల్ 28 (నాటౌట్) పరుగులు చేశాడు.

భారత్‌లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్‌లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఆ ధీమాతోనే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. తమ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే… రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్త బంతిని అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీయడం తెలిసిందే.

అనంతరం 284 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కివీస్‌ను అశ్విన్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ విల్ యంగ్‌ (2)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో నాలుగు రోజు ఆటముగిసే సమయానికి కివీస్ జట్టు 4/1 స్కోరుతో నిలిచింది. టామ్‌ లాథమ్‌ (2 నాటౌట్‌), విల్ సోమర్‌విల్లె (0 నాటౌట్ క్రీజులో ఉన్నారు.

- Advertisement -