మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై టీమిండియా ఆధిక్యాన్ని సాధించింది.రిషబ్ పంత్(101) సెంచరీతోపాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (60 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీమ్ 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో కోహ్లి సేన 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుందర్తోపాటు అక్షర్ పటేల్ (11) ఉన్నాడు. పంత్ ఔటైన తర్వాత కూడా ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఎనిమిదో వికెట్కు ఇప్పటికే 35 పరుగులు జోడించారు.
అంతకుముందు మిడిలార్డర్ విఫలమవడంతో ఒక దశలో టీమిండియా 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కెప్టెన్ కోహ్లి (0)తోపాటు రహానే (27), అశ్విన్ (13), పుజారా (17) విఫలమయ్యారు. రోహిత్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో పంత్, సుందర్ టీమ్ను ఆదుకున్నారు. లీడ్ అసలు సాధ్యమేనా అనిపించినా.. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 113 పరుగులు జోడించి కీలకమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఈ క్రమంలో పంత్ టెస్టుల్లో మూడో సెంచరీ చేయగా.. సుందర్ మూడో హాఫ్ సెంచరీ చేశాడు.