పింక్ బాల్ టెస్టు: భారత్‌ 145 ఆలౌట్‌

207
India 145 all out
- Advertisement -

మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 99/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెంటవెంటనే 3 కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. 7 పరుగులు చేసిన రహానే లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ (66) కూడా అవుట్ కావడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రోహిత్ కూడా లీచ్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

ఇక, భారీ హిట్టర్ రిషబ్ పంత్ ను ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన తొలిబంతికే పెవిలియన్ చేర్చాడు. ఆపై మరోసారి విజృంభించిన రూట్… ప్రమాదకర వాషింగ్టన్ సుందర్ ను బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ 125 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. టీమ్‌ఇండియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది.

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(66: 96 బంతుల్లో 11ఫోర్లు) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. శుభ్‌మన్‌ గిల్‌(11), పుజారా(0), విరాట్‌ కోహ్లీ(27), రహానె(7), పంత్‌(1), వాషింగ్టన్‌ సుందర్‌(0), అక్షర్‌ పటేల్‌(0) నిరాశపరిచారు. ఆఖర్లో అశ్విన్‌ కొద్దిసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -