విజయ డెయిరీ అభివృద్ధిపై మంత్రి తలసాని సమీక్ష..

64
- Advertisement -

తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్‌ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్‌ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఇంచార్జి డెయిరీ ఎండీ అనిత రాజేంద్ర, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విజయ డెయిరీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ధతో అత్యధిక పాలను సేకరించి వినియోగదారులకు నాణ్యమైన పాలను, పాల ఉత్పత్తులను అందిస్తున్నదని తెలిపారు. ఎంతో ప్రజాధరణ కలిగి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి చేయబడుతున్న విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్ళే విధంగా ఉన్నతస్థాయి మార్కెటింగ్, విస్తృత ప్రచారం పాలసీని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రప్రధమంగా ప్రస్తుతం ఉన్న ఔట్ లెట్ లకు అదనంగా మరిన్ని నూతన ఔట్ లెట్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా పాలు, పెరుగు, లస్సి, దూద్ పేడ, బాదం పాలు, నెయ్యితో పాటు టెట్రా ప్యాక్, మలాయ్ లడ్డు, రాగి లడ్డు, మిల్లెట్ లడ్డు వంటి సుమారు 33 రకాల ఉత్పత్తులను ఔట్ లెట్‌ల ద్వారా విక్రయిస్తున్నట్లు వివరించారు.

సహకార రంగంలో పనిచేస్తూ లాభాపేక్ష లేకుండా కేవలం పాడిరంగంపై ఆధారపడి ఉన్న రైతుల అభివృద్దికి కృషి చేస్తూ తద్వారా ప్రజలకు నాణ్యమైన పాలన అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న విజయ డెయిరీ మార్కెట్ అవసరాలను, పోటీరంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రతి వినియోగదారుడికి చేరువయ్యే విధంగా చూడాలని సూచించారు. నూతన మార్కెటింగ్ విధానాలను అవలంభిస్తూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ టర్నోవర్ 800 కోట్ల రూపాయలుగా ఉందని, దానిని 1500 కోట్ల రూపాయలకు చేరుకొనే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించుకొని, నిర్దేశించిన లక్ష్యాలను చేరే విధంగా కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. త్వరలో ప్రారంభం కానున్న మెగా డెయిరీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

విజయ డెయిరీ ఔట్ లెట్ నిర్వహకులను మరింత ప్రోత్సహించే విధంగా అత్యధిక విక్రయాలు జరిపిన వారికి ప్రోత్సాహాకాలు అందించే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ వారితో కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ఇందల్ వాయ్, పంతంగి, కొర్లపహాడ్, పిప్పల పహాడ్, గూడూరు, గంజాల్ టోల్ గేట్‌ల వద్ద విజయ తెలంగాణ పార్లర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజులలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బిగ్ బాస్కెట్, ప్లిప్ కార్ట్, సూపర్ డెయిరీ వంటి సంస్థల ద్వారా కూడా విజయ తెలంగాణ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ డెయిరీ లకు దీటుగా నెయ్యిని పెట్ జార్ లలో విక్రయిస్తున్నామని, సుగంధ పాలను కూడా పెట్ బాటిల్స్ లలో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. తెలంగాణ విజయ డెయిరీ సంస్థ అభివృద్ధికి, విజయ ఉత్పత్తుల ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలను రూపొందించి వచ్చే నెల 16 వ తేదీన నిర్వహించే బోర్డ్ సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. బోర్డ్ సమావేశంలో చర్చించి అవసరమైన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, నేషనల్ హైవే రహదారుల వెంట విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, చార్మినార్, దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి వంటి అన్ని ప్రధాన ప్రాంతాలలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న అన్ని విజయ డెయిరీ ఔట్ లెట్ లలో తనిఖీలు జరిపి అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్ లో రోజురోజుకు చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విజయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే విషయంలో నూతన పద్దతులను అవలంభించాలని, ఇతర డెయిరీ లకు దీటుగా ఆకర్షణీయమైన ప్యాకింగ్ లతో నాణ్యమైన పాల ఉత్పత్తులను సరఫరా చేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని మంత్రి చెప్పారు.

సంస్థ అభివృద్ధి సాధించుటకు మరియు అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పుష్ కార్ట్ లు మరియు ఐస్ క్రీం ఫ్రీజర్ లను సబ్సిడీపై అందించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వేసవి ప్రారంభం కావడానికి ముందే ఫుష్ కార్ట్‌ల (ట్రై సైకిల్స్) ద్వారా విజయ ఐస్ క్రీం విక్రయాలు చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు విజయ ఉత్పత్తులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి విజయ ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సహకారం, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఫలితంగా నష్టాలలో ఉన్న విజయ డెయిరీ లాభాల బాట పట్టిందని, మరింత లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -