ఐసీసీ (ICC) యాంటీ కరప్షన్ కోడ్కు సంబంధించిన మూడు ఉల్లంఘనల్లో నిందితుడిగా తేలడంతో అమెరికా క్రికెటర్ బొడుగం అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్ ఎనిమిదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేధం విధించింది. అతను తాత్కాలిక సస్పెన్షన్కు గురైన నవంబర్ 21, 2025 నుండి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ఇది నవంబర్ 2033 వరకు కొనసాగుతుంది.
2025 అబుదాబి T10 లీగ్ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తరఫున ఐసీసీ డెసిగ్నేటెడ్ యాంటీ కరప్షన్ ఆఫీషియల్ (DACO)గా వ్యవహరించింది.
మ్యాచ్ ఫలితం, పురోగతి లేదా ప్రవర్తనను ఫిక్సింగ్ చేయడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు ఆర్టికల్ 2.1.1 ఉల్లంఘన కింద అఖిలేష్ నిందితుడిగా తేలాడు. అలాగే ఆర్టికల్ 2.1.1 ని ఉల్లంఘించేలా మరొక పాల్గొనే వ్యక్తిని ప్రేరేపించడం, ఒత్తిడి చేయడం, సూచనలు ఇవ్వడం లేదా ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడినందుకు ఆర్టికల్ 2.1.4 కింద కూడా అతడు దోషిగా నిర్ధారించబడ్డాడు.
దీనికి తోడు, తన మొబైల్ డివైజ్ నుండి విచారణకు సంబంధం ఉన్న సమాచారం మరియు మెసేజ్లను డిలీట్ చేయడం ద్వారా దర్యాప్తుకు ఆటంకం కలిగించాడని తేలడంతో, ఆర్టికల్ 2.4.7ను ఉల్లంఘించినట్లు కూడా ట్రైబ్యునల్ పేర్కొంది.
అఖిలేష్ యుఎస్ఏ (USA) తరఫున నాలుగు T20I మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు, ఈ మ్యాచ్లన్నీ 2025 ఏప్రిల్లో జరిగాయి. ఈ సంవత్సరం అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించి చర్యలకు గురైన రెండవ యుఎస్ఏ అంతర్జాతీయ ఆటగాడు ఈయనే. అంతకుముందు, 2023-24 సీజన్లో బార్బడోస్ ‘Bim10’ టోర్నీలో పాల్గొన్నప్పుడు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఐదు ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను బ్యాటర్ ఆరోన్ జోన్స్పై కూడా తాత్కాలిక సస్పెన్షన్తో పాటు శిక్ష విధించారు.
Also Read;క్యాన్సర్ వైద్యంలో నూతన అధ్యాయం

