ఖాజీపల్లి ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న హీరో ప్రభాస్‌..

208
prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్, అభిమానుల డార్లింగ్ యాక్టర్ ప్రభాస్ మరో డేరింగ్ స్టెప్ వేశారు. తన సినిమాల లాగే తన మనసు కూడా భారీ అని నిరూపించే నిర్ణయం తీసుకున్నారు. 1650 ఎకరాల అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుని అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకో టూరిజం కేంద్రం అందుబాటులోకి రానుంది. స్వయంగా ఖాజిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చిన ప్రభాస్, తన దత్తత విషయాన్ని ప్రకటించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటడంతో పాటు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ పై నుంచి అటవీ అందాలను వీక్షించారు.

సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తితో, పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ప్రభాస్ ప్రకటించారు. అటవీ ప్రాంతం అభివృద్ది కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ప్రభాస్ వెల్లడించారు. ముందస్తుగా రెండు కోట్ల రూపాయల చెక్కును ప్రభుత్వానికి అందించారు. మిగతా మొత్తాన్ని దశల వారీగా ఇస్తానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, దుండిగల్ మధ్య ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతం అంతా ఔటర్ రింగు రోడ్డు పక్కనే విస్తరించి ఉంది. చుట్టు పక్కల అభివృద్ది చెందిన నివాస కాలనీలు, పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొంత భాగాన్ని అర్బన్ పార్కుగా అందుబాటులోకి తేవటంతో పాటు, మిగతా ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్ గా అభివృద్ది చేయాలని నిర్ణయించారు.

ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం వివిధ రకాల ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. మూడు కంపార్ట్ మెంట్లలో విస్తరించి ఉన్న 1650 ఎకరాల అటవీ ప్రాంతాన్ని మొత్తం కచ్చితమైన సరిహద్దుల ఏర్పాటుతో అటవీ శాఖ కాపాడనుంది. సమీప ప్రాంత వాసులకు అందమైన పార్కు అందుబాటులోకి వచ్చేలా తక్షణం పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో పార్క్ గేట్, సీ థ్రూ వాల్, వాకింగ్ ట్రాక్, వ్యూ పాయింట్, గజేబో, ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు. అదేవిధంగా అటవీ స్థలం ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా తగిన రక్షణ చర్యలను కూడా తీసుకోనున్నారు.

 దుండిగల్, గడ్డపోతారం, గుండ్ల పోచంపల్లి, గాగిల్లాపూర్, కిష్టాయపల్లి, ఖాజిపల్లితో పాటు ఔటర్ కు ఇరువైపులా వెలిసిన కాలనీలు, టౌన్ షిప్ లకు ఈ అర్బన్ పార్క్ స్వచ్చమైన ఆక్సీజన్ ను అందించే కేంద్రంగా ఉపయోగపడనుంది. HMDA  పరిధిలో ఉన్న అన్ని అటవీ బ్లాకులకు అభివృద్ది చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా తీర్చి దిద్దాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ అర్బన్ పార్కుకూడా అభివృద్ది చెందనుంది. 
- Advertisement -