వానొచ్చే…. వరదొచ్చే…

234
telangana rain
- Advertisement -

రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. వానలు విస్తారంగా కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మత్తడి తొక్కిన పలు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

telangana rain

ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పొంగిపొర్లుతుండటంతో కుంటాల జలపాతం కనువిందు చేస్తోంది. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. అటు పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలకు పెద్దవాగులో నీటి ప్రవహం పెరిగి జలపాతం వద్ద వరద నీరు వడివడిగా కిందికి దుంకుతోంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అటు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.

Sri-Ram-Sagar-Project

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా నీటి మట్టం వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపు పనులకు విఘాతం కలిగింది.

- Advertisement -