కేంద్రం తీరుపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు.సిద్ధిపేటలోని బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన హై రిస్క్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఢిల్లీ సర్కారు అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అనుసరిస్తున్న తప్పుడు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని సూచించారు.
కొవాగ్జిన్, కొవీషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్నివ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వే మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కరోనా మూడో దశను కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసే దిశగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.