త్యాగాలు బీఆర్ఎస్వి.. మోసాలు రేవంత్ రెడ్డివి అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్ లో BRS పార్టీ నియోజకవర్గం స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు.. SIR పై కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది..తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలా వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి అయితే.. జిరాక్స్ కాపీలతో డ్రామాలు ఆడి గద్దెనెక్కిన మోసాలు రేవంత్ రెడ్డివి.
85 రోజులు దాటినా రైతుబంధు లేదు, 5 నెలలుగా రైతుబీమా బంద్, యాసంగి బోనస్ ఎగ్గొట్టి అన్నదాతలను నిలువునా మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు పైసలు ఇవ్వకుండా.. గొల్ల కురుమలు, మత్స్యకారులు, చేనేత, గౌడన్నల సంక్షేమాన్ని బంద్ పెట్టి సబ్బండ వర్గాల పొట్టగొడుతున్నారు.విద్యార్థుల ఫీజులకు, పేదల ఇళ్లకు పైసలు లేవంటున్న సీఎం.. తన క్యాంప్ ఆఫీసుల సోకులకు, ఫుట్ బాల్ కు మాత్రం వందల కోట్లు తగలేస్తున్నారు.రేవంత్ది ‘మిషన్ మోడ్’ కాదు ‘కమీషన్ మోడ్’.. కమీషన్లు రాని దళితబంధు, కులవృత్తుల సంక్షేమాన్ని, విద్యార్థుల ఫీజులను నిలువునా పాతరేశారు అన్నారు.
ప్రజా సమస్యలపై నిలదీస్తే నా ఎత్తు గురించి చిల్లర మాటలు చేస్తావా రేవంత్ రెడ్డీ? నా ఎత్తుతో నీకేం పని? నువ్వు ఎగ్గొట్టిన పథకాలపై, చేస్తున్న స్కాములపై ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం.. నీ మెడలు వంచి తీరుతాం.ప్రభుత్వ స్కాములను, వైఫల్యాలను బయటపెడుతూనే ఉంటాం.. ప్రతిపక్షంగా ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా నిలబడి పోరాడుతాం.ఓటర్ల ముమ్మర సవరణ SIR ప్రక్రియలో కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తుంటే.. ఆయనతో పాటే అలుగునూరు చౌరస్తాలో అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు…ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమానికి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనం అన్నారు.
హుస్నాబాద్ అంటే కేసీఆర్ గారికి ఎంతో నమ్మకం. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించేవారు. కేసీఆర్ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం పట్టి, తొలిరోజుల్లోనే ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఇది…నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కోసం మనం దీక్షలు చేశాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హుస్నాబాద్ను రెవెన్యూ డివిజన్గా మార్చారు. ఎస్పీ, డీఎస్పీ, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీసులు తెచ్చుకున్నాం. బస్టాండ్ను ఫుల్ ఫ్లెడ్జ్ డిపోగా మార్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును, గండి మహాసముద్రం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారు.SIR ఓటర్ల సర్వే విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఇది చనిపోయిన, డబుల్ ఓట్లను తొలగించి జాబితాను సవరించే ప్రక్రియ.అధికారికంగా ఇందులో పార్టీలకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు (అంగన్వాడీ టీచర్లు) ఇంటింటికి వచ్చేటప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట వెళ్లాలి.ఎవరైనా అధికారులు సహకరించకపోతే ఏఆర్ఓ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయొచ్చు. ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు, ఓటరు నమోదు ఫారాలు నింపడంలో ప్రజలకు మనమే దగ్గరుండి సహాయపడాలి.కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా చూసుకోవాలి. ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతుంది.రాజశేఖర్ రెడ్డి హయాంలో 610 జీవో అమలు చేయకపోతే, పోతిరెడ్డిపాడు పెంచుతుంటే.. మనమే తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేశాం అన్నారు.
తెలంగాణ కోసం రాజీనామా చేయాలన్నప్పుడు ముందుగా స్పీకర్ కి రాజీనామాలు ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..రేవంత్ రెడ్డి మాత్రం ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకుని జిరాక్స్ కాపీ ఇచ్చి డ్రామాలు ఆడాడు. ఎలాంటి త్యాగం చేయని వ్యక్తి సీఎం అయ్యాడు. తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే.. మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి.గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీ జరిగితే.. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు మోసపోయారు. కానీ రేవంత్ మోసగాడన్న నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది.ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2730 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి, కేవలం 52 కోట్లు.. అది కూడా కరెంట్ బిల్లులు, జీతాలకే ఖర్చు చేశారు. ఒక్క ఎస్టీ యువకుడికి కూడా ఉపాధి కల్పించలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ మంత్రిగా ఉండేవారు, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేడు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ నిధులు ల్యాప్స్ కాకుండా ‘క్యారీ ఫార్వర్డ్’ విధానాన్ని కేసీఆర్ తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద 5403 కోట్లు కేటాయించినా ఒక్క దళితుడికి కూడా లోన్ రాలేదు. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామన్న హామీ గాలికి పోయింది.బీసీ కార్పొరేషన్ కు 1370 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 33 కుల కార్పొరేషన్లు పెట్టి, అందులో కాంగ్రెస్ నేతలకు కుర్చీలు ఇచ్చారు తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదు.కేసీఆర్ యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఏటా 100 కోట్లతో ఉచిత చేప పిల్లలు ఇస్తే.. కాంగ్రెస్ వాటన్నింటినీ బంద్ పెట్టింది.చేనేతన్నలకు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు కేసీఆర్ ఇస్తే, రేవంత్ రెడ్డి ఆ ఆర్డర్లను గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టి నేతన్నల పొట్టగొట్టాడు. చేనేత సబ్సిడీలు ఆపేశాడు అన్నారు.
గౌడన్నలకు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చి, చెట్ల పన్ను రద్దు చేసి ఆదుకున్న ఘనత కేసీఆర్ ది. కానీ రేవంత్ రెడ్డి వేలాది మంది గౌడన్నలను జైళ్లకు పంపుతున్నాడు.గౌరవెల్లి ప్రాజెక్టును ప్రత్యేక ప్యాకేజీతో పూర్తి చేసి కేసీఆర్ ట్రయల్ రన్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా కనీసం 30 గజాల కాలువ కూడా తవ్వలేదు.సొంత జిల్లాలోని పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికే తనకు రెండున్నరేళ్లు పట్టిందని సీఎం అంటున్నాడు, మరి గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేళ్లు పడుతుందా? చేతగాక అధికారుల మీద నెపం నెడుతున్నాడు.85 రోజులు దాటినా రైతుబంధు దిక్కులేదు. కేసీఆర్ తెచ్చిన రైతుబీమా 5 నెలలుగా ఆగిపోయింది.
వడ్లకు 5 కిలోల తరుగు పెడుతున్నారు. సన్నాలకే బోనస్ అని చెప్పి ఇప్పుడు కేవలం 7 రకాలకే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారు.గురుకుల పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడు కానీ.. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే 15-20% కమీషన్లు వస్తాయని అటు పైసలు మళ్లిస్తున్నాడు. రేవంత్ది మిషన్ మోడ్ కాదు కమీషన్ మోడ్. గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొడుతున్నాడు.స్కూల్ పిల్లల ప్రోగ్రాంకు పోయి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా ఎత్తు గురించి, నేను తాటిచెట్టు, ఈతచెట్టు లెక్క పెరిగానని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రికి నా ఎత్తుతో పనేంటి?,నేను రేవంత్ లాగా చిల్లర మాటలు మాట్లాడను. రైతుబంధు ఎప్పుడిస్తావ్? రైతుబీమా ఎప్పుడిస్తావ్? బోనస్ ఏమైంది? ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడిస్తావ్? అని ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తా. హామీలు నెరవేర్చేదాకా నేను నిలదీస్తూనే ఉంటా, స్కాములు బయటపెడుతూనే ఉంటా.ఖజానాలో పైసలు లేవంటాడు కానీ.. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్, తన ఇంటికి 17 కోట్లతో ఇనుప కంచెలు కట్టుకుంటున్నాడు.పేద ఎస్సీ, ఎస్టీ పిల్లలతో కాకుండా తన మనుమడు, మంత్రులు, రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలతో ఫుట్ బాల్ ఆడేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు.సిటీలో మోరీలు బాగుచేయడం చేతకాని వాడు ఫ్యూచర్ సిటీ కడతాడట. 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అని కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాడు.జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే, కమీషన్లు రావని రేవంత్ జర్నలిస్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తే, కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలను అప్పుల పాలు చేస్తోంది. ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు.
Also Read:బరువు తగ్గడం కోసం తక్కువ తింటున్నారా?
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పట్టించుకోలేదు. నేను నిమ్స్ కు వెళ్లి, బయట మందులు కొనుక్కుంటున్న ఆ తల్లి బాధను, బిల్లులను మీడియాకు చూపిస్తే అప్పుడు ఈ దద్దమ్మ ప్రభుత్వం కదిలింది.దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా నిలబడి పోరాడుతోంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది.హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. ఐరోపాలో హిట్లర్ పేరు ఎత్తితే ఎలా నిషేధిస్తారో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు నిషేధించే రోజు వస్తుంది అన్నారు.

