సన్నాలకు బోనస్ బంద్,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్,గ్యాస్ బండకు రాయితీ బంద్,రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బిఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్ అయిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్.. ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పథకాలను అటకెక్కించారు, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు గాలికి వదిలేశారు… రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు…ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ అని దుయ్యబట్టారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదు రేవంత్.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయ హస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టావు అన్నారు.
గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డిడి పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి మీది.,నీ మాటలు విని విని విసిగి పోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తోలుకొని వచ్చారు. నిరసన తెలియచేసారు… మీ మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తకముందే కళ్ళు తెరువు అన్నారు. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు అన్నారు.
Also Read:నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

