Harishrao: కేసీఆర్ కల సాకారమైంది

4
- Advertisement -

జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు లభించాయని చెప్పారు. ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ అకడమిక్ ఇయర్ కు అందుబాటులోకి రానున్నాయన్నారు. కొత్త సీట్లతో కలుపుకొని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090 కు చేరుకుందన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరిందని హరీశ్‌రావు తెలిపారు. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 5 రెట్లు పెంచిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పదివేల మందికి పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసమని లక్షలు ఖర్చు చేసి.. చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు తెలిపారు.

Also Read:Revanth Reddy:అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదు

- Advertisement -