తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత ఉందని వెంటనే పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి రెండు రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఆయన లేఖ రాశారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106శాతం సాధించిందని, రెండో డోస్ వ్యాక్సినేషన్లో 104శాతం సాధించామన్నారు. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి వాక్సినేషన్లోనూ దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.
రోజుకు 1.5లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని డిమాండ్కు సరిపడా వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా కావడం లేదన్నారు. తక్షణమే 50లక్షల కొవిషిల్డ్ వ్యాక్సిన్ డోసులను తెలంగాణకు పంపాలని కేంద్రమంత్రిని కోరారు. వ్యాక్సినేషన్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్ రావు పేర్కొన్నారు.