ఇంటి మాదిరిగా ప్రతీ గల్లీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సిద్ధిపేటలోని 6వ వార్డులో సోమవారం ఉదయం రెండవ విడత పట్టణ ప్రగతిని ప్రారంభించారు.
వార్డులోని కాలనీల్లో పాదయాత్ర చేపట్టారు. కాలనీ వాసులతో మాట్లాడి అక్కడి స్థానిక సమస్యలపై ఆరా తీస్తూనే.. ఇంటి గృహిణీలతో.. అమ్మా తడి, పొడి, హానికర చెత్త అంటే ఏమిటనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
తడి చెత్త ఎప్పుడు..? పొడి చెత్త ఎప్పుడు.. మన సిద్ధిపేట మున్సిపాలిటీ ఏ వారంలో ఏ చెత్త సేకరిస్తున్నదని స్థానిక ప్రజలను అడుగుతూ.. ఈ రోజూ ఇస్తున్న చెత్త ఏమిటనే ఆరా తీశారు.
తడి చెత్తలో భాగంగా తినే ఆహారం- అన్నం, కూరగాయలు ఎక్కువగా వస్తున్నాయని.. ఎందుకు వేస్ట్ చేస్తున్నారని ప్రజలను ఆరా తీస్తూ..పర్యటనలో భాగంగా ఓ ఇంటి ముందు డ్రమ్ములో కొన్ని రోజులుగా నీరు నిల్వ ఉండటంతో.. వాటి ద్వారా వచ్చే పరిణామాలపై ప్రజలకు మంత్రి అవగాహన కల్పించారు.
మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీరు వెళ్లి పోయేలా చూడటం, రోడ్ల వెంట పిచ్చిమొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించడం లాంటివి చేసి రానున్న వర్షాకాల సీజన్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మంత్రి విజ్ఞప్తి చేశారు.
దోమలు, వాటి లార్వాను నిర్మూలించేందుకు నివాసిత ప్రాంతాల్లో స్ర్పేయింగ్, ఫాగింగ్ లాంటివి చేపట్టాలని, ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచేలా చూడాలని మున్సిపల్ అధికారులకు మంత్రి సూచన.
ఇళ్ల పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమిషాల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు భాగస్వామ్యం కావాలని కోరారు.
కాలనీల్లో ఇంటింటా సేకరిస్తున్న చెత్తలను ఇంటి గృహిణీలతోనే తడి, పొడి, హానికర చెత్తలను వేర్వేరుగా విభజన చేయించి కాలనీ ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్యం పై చక్కటి అవగాహన కల్పించారు