ప్రస్తుతం తెలంగాణ 33 జిల్లాలుగా అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. తొలుత 31 జిల్లాతో పునర్విభజన జరుగగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ములుగు,నారాయణపేటను జిల్లాలుగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించగా వరంగల్ రూరల్,వరంగల్ అర్బన్,జనగాం,భూపాలపల్లి,ములుగు,మహబూబబాద్ జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వరంగల్, హన్మకొండ జిల్లాలు పునర్విభజనకు నోచుకునే అవకాశం ఉందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. దామెర్ల మండలం ల్యాదెళ్ల గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ముఖ్య కార్తకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మాత్రం త్వరలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.
వరంగల్ అర్భన్,వరంగల్ రూరల్ స్ధానంలో వరంగల్,హన్మకొండగా పేరు మారే అవకాశం ఉందన్నారు. గడచిన 70 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, మేలంటూ జరిగితే సీఎం కేసీఆర్ వల్లేనని చెప్పారు. రాష్ట్రంలో వృద్ధులకు గౌరవమిచ్చిన ఘనత, రైతు సంక్షేమానికి కృషి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. భూపాలపల్లిలో పరకాలను కలపనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.