అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి – మంత్రి ఈశ్వర్

67
koppula
- Advertisement -

అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై సోమవారం మంత్రి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వీడియో కాన్పరెన్సు ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారని మంత్రి తెలిపారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే మంచిది కాదని గుర్తించిన ప్రభుత్వం గత 7సంవత్సరాలో తెలంగాణకు హరితహారం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటిందని మంత్రి తెలిపారు.

సీఎం కేసిఆర్ కృషి ఫలితంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని మంత్రి అన్నారు, పోడు భూముల సమస్యలపరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమాయకమైన గిరిజనలు, ఇతర వర్గాలకు చెందిన పేదలకు నష్టం జర్గకుండా, అదే సమయంలో భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వారు దుర్వినయోగం చేయకుండా సమస్యను పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. అడవుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో పాటు పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయి సహకరించాలని మంత్రి కోరారు. అడవులను విధ్వంసం చేసే వారిని గుర్తించి వారిపై కఠినంగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 96,679 మంది పోడు రైతులకు 3,08,614 ఎకరాల భూమి ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలను ప్రభుత్వం అందించిందని, ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మరో 7,23,629 ఎకరాల అటవీ భూమిలో 1,99,354 మంది పోడు సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు.

జిల్లాలో ఆక్రమణకు గురైన అటవీ భూములలో సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు సేకరించాలని, భూ కబ్జాదారులు, రియల్ స్టేట్ చేసే వారిని గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ ప్రాంతాలు ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సభ, అటవీ హక్కుల కమిటి ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు నెల రోజుల పాటు పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వికరిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేస్తామని, అర్హులను గుర్తించి పట్టాలు ధృవీకరించే సమయంలో సీఎం ఆదేశాల మేరకు మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

పోడు భూముల సమస్య పరిష్కరించిన తరువాత గ్రామంలో మరో ఇంచ్ అటవీ భూమి ఆక్రమణకు పాల్పడకుండా సంబంధిత గ్రామ సభ తీర్మానించాలని మంత్రి తెలిపారు అడవిలోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయిస్తామని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో పోడు సాగుకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన తరువాత మిగిలిన అటవీ భూమి పకడ్భందిగా సంరక్షించుకోవాలని తెలిపారు. అటవీ సరిహద్దు ఏర్పాటు చేసి ఉపాధి హామి నిధులు, అటవీ నిధులు సంయుక్తంగా వినియోగిస్తూ చుట్టు ప్రహారీ గోడలు, ట్రేంచ్ లు నిర్మించాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. హరితహారంలో భాగంగా మనం సామాజికంగా మనం ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని మంత్రి తెలిపారు.

10 ఎకరాల భూమి కొన్ని లక్షల మొక్కలతో సమానమని, దీనిని గుర్తించిన ప్రభుత్వం అడవుల పునరుజ్జీవనం చేసే దిశగా పకడ్భందిగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు‌ 1347 కోట్లు ఖర్చు చేసి 10.63 లక్షల ఎకరాలో 42 కోట్ల 41 లక్షల మొక్కలు నాటి అటవీ పునరుజ్జీవనం చేసామని మంత్రి తెలిపారు, పోడు సాగు భూమి పట్టాలు అందించిన తరువాత వారికి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ డా. సంగీత సత్యనారాయణ,అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిమనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్, డి.ఎఫ్. ఓ.శివయ్య, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -