నిరంతర విద్యుత్ సరఫరా ప్రభుత్వ ధ్యేయం- మంత్రి అల్లోల

99
- Advertisement -

దేశంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్​ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం సారంగాపూర్ మండ‌ల కేంద్రంలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన‌ 132/33 కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… పట్టణాలు, గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు నిధులను కేటాయిస్తున్నార‌ని అన్నారు. ప్రజలకు నిరంతరం నాణ్య‌మైన‌ కరెంట్ సరఫరా లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నెలకొల్పినట్లు తెలిపారు.

గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోవడం, లోవోల్టేజీ సమస్యలతో వినియోగదారులు నానా అవస్థలు ప‌డ్డార‌ని, ఇప్పుడు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్విరామంగా విద్యుత్ స‌ర‌ఫరా చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటుతో లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్ స‌మ‌స్య‌లు తీరిపోనున్నాయ‌ని పేర్కొన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకి ఈ ఉప కేంద్రం బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. నియోజకవర్గంలో 50 కి పైగా స్టేషన్ లను ఏర్పాటు చేశామని, సారంగపూర్ మండలంలోనే 9 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నామని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రైతుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. స్వర్ణ వాగు పైన నిర్మించిన చెక్ డ్యామ్ లతో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు..

- Advertisement -