నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ (ఎన్పీసీడీసీఎస్)లో చేరుస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం ప్రకటించారు. దేశానికి నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల భారాన్ని తగ్గించడంలో ఇదో అద్భుతమైన మందడుగు కానుంది. కాలేయ వ్యాధుల చికిత్స, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో పేరెన్నికగన్న గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది.
గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ చందన్కుమార్ ఇది అద్భుతమైన నిర్ణయమంటూ స్వాగతించారు. మన దేశంలో 32 శాతం మంది ప్రజలు ఫాటీ లివర్ డిసీజ్ బారినపడుతున్నారని ఆయన చెప్పారు. అధిక బరువు, ఊబకాయం, మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఫాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ. మధుమేహ వ్యాధికి ప్రపంచ రాజధానిగా భారతదేశం మారుతున్నందున భవిష్యత్తులో ఫాటీ లివర్ వ్యాధి కూడా మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ వ్యాధి సోకిన రోగుల్లో 15% నుంచి 25% మందికి ఇది క్రమంగా లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. చాలామందిలో ఫాటీ లివర్ వ్యాధి ఉందని గుర్తించకముందే వారిలో లివర్ సిరోసిస్ చివరి దశకు చేరుకుంటుండటం కలవరపరిచే అంశంగా డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధిని కేంద్ర ప్రభుత్వ పథకంలో చేర్చి చికిత్సకు మార్గం సుగమం చేయడం మంచి నిర్ణయమని వారు అంటున్నారు.
గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా.రాఘవేంద్రబాబు మాట్లాడుతూ ఫాటీలివర్ వ్యాధి 2022లో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రధాన కారణంగా మారబోతోందని చెప్పారు. అంతేకాదు కాలేయ మార్పిడి కోసం వేచిచూస్తున్న రోగుల్లో లివర్ క్యాన్సర్ ముప్పును కూడా ఇది పెంచబోతుంది.
ఫాటీ లివర్ వ్యాధికి తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయడం చాలా అవసరం. అలా చేస్తే మధుమేహం, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ పెరగడంతోపాటు లివర్ డ్యామేజ్ ముప్పును తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చికిత్స కంటే నివారణే సులువు అన్నది అందరికీ తెలిసిందే. కాబట్టి కుటుంబంలో మధుమేహం, గుండెజబ్బులు, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులున్నవాళ్లు ఉంటే అలాంటి కుటుంబంలో యుక్తవయసులో ఉన్నవారికి కూడా ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం మంచిది. ఒకవేళ అలాంటిదేమైనా ఉందని తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధి మరింత ముదరకుండా అడ్డుకోవడంతోపాటు వారిని తిరిగి ఆరోగ్యవంతులను చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ లివర్ ఫిజీషియన్ డాక్టర్ చందన్ చెప్పారు.