ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం..

235
- Advertisement -

తొలి హైడ్రోజన్ రైలును జర్మనీ సోమవారం పట్టాలపైకి తెచ్చింది. ఉత్తర జర్మనీలోని కక్సావెన్‌, బ్రెమెరావెన్‌, బ్రెమెర్‌వోర్డ్‌, బక్సెహుడ్‌ నగరాల మధ్య 1000 కిలోమీటర్ల మార్గంలో రెండు హైడ్రోజన్‌ రైళ్లు సేవలు అందించనున్నాయి. డీజిల్‌ రైళ్లతో తలెత్తుతున్న కాలుష్య సమస్యకు తెరదించేలా జర్మనీ సరికొత్త ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించారు. కొరాడియా ఐలింట్‌ రైళ్లుగా పిలిచే హైడ్రోజన్‌ రైళ్లను ఫ్రాన్స్‌ సంస్థ ‘అల్‌స్టోమ్‌’ తయారుచేసింది. డీజిల్‌ రైళ్లతో పోలిస్తే అవి ఖరీదైనవని. వాటిని నడిపించడం మాత్రం చవకే.

first hydrogen-powered train

ఒకే ఒక్క హైడ్రోజన్‌ ట్యాంకుతో అవి దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఖాళీ అయిన ఇంధన ట్యాంకులను తిరిగి నింపడానికి కేవలం 15 నిమిషాలు చాలు. ఈ రైళ్లు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. జర్మనీలోని లోయర్‌ సాక్సోనీ రాష్ట్రానికి 2021లోగా 14 హైడ్రోజన్‌ రైళ్లను అందజేయనున్నట్లు ‘అల్‌స్టోమ్‌’ తెలిపింది. బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, నార్వే, ఇటలీ, కెనడా తదితర దేశాలు కూడా వాటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించింది.

హైడ్రోజన్ రైళ్లలో ఉపయోగించే ఇంధనం వల్ల కాలుష్య ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకనే ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. హైడ్రోజన్, ఆక్సిజన్‌లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థ ఇందులో ఉంటుంది. అవసరానికి మించి విద్యుత్తు కనుక ఉత్పత్తి అయితే, అది నేరుగా రైలులో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీల్లోకి చేరి నిల్వ ఉంటుంది.

- Advertisement -