గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపథ్యంలో కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను సోమవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ లు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బలాలా, జాఫర్ హుస్సేన్, సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి లు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు,ఎస్ఈ లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దసరా నుంచి బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. వర్తకులు, రైతుల అవసరాల దృష్ట్యా గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాటసింగారంలో అదనంగా రోడ్లు, పార్కింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కోహెడలో 178 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అన్ని విషయాలలో వ్యాపారులకు సహకారం ఉంటుంది. పండ్లు పండించే రైతుల సౌకర్యంతో పాటు, వర్తకులకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.