తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ని తమ ఆదీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తాలిబన్లు…అన్ని ప్రభుత్వ ఆఫీసులపై తమ జెండా పాతేశారు. ఇక ఎప్పటికప్పుడు తమ కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో అవి వైరల్గా మారాయి.
ఈ నేపథ్యంలో తాలిబన్ల సమాచారానికి చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని స్పష్టం చేస్తూ నిషేధం విధించినట్టు ప్రకటించింది. అంతేగాదు తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది.
తాలిబన్లకు సంబంధించిన సమాచారంపై ఓ కన్నేసి ఉంచుతామని.. దానికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది ఫేస్బుక్. ఇందుకోసం ఆఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులను ఆ స్పెషల్ టీమ్లో సభ్యులుగా చేర్చింది.