ఢిల్లీ మెట్రో నెట్వర్క్ త్వరలోనే మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది. ఫేజ్ 5Aకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను రాజధానిలోనే అత్యంత కీలకమైన ట్రిపుల్ ఇంటర్చేంజ్ హబ్గా అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్పుతో మెరుగైన కనెక్టివిటీ, ప్రయాణ సమయం తగ్గింపు, సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వెల్లడించింది. ఇప్పటికే లక్షలాది ప్రయాణికులను మోయుతున్న ఢిల్లీ మెట్రో, నగరంలోని ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు ప్రధాన పరిష్కారంగా మారుతోంది.
ప్రస్తుతం సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ యెల్లో లైన్, వైలెట్ లైన్లకు మధ్య ఇంటర్చేంజ్గా ఉంది. రోజుకు సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను వినియోగిస్తుండగా, సమీపంలోని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే దాదాపు 60 వేల మంది ఉద్యోగులు ఇక్కడి నుంచే ప్రయాణిస్తారు. ఫేజ్ 5A అమలుతో మజెంటా లైన్ విస్తరించడంతో ఈ స్టేషన్ పూర్తి స్థాయి ట్రిపుల్ ఇంటర్చేంజ్ హబ్గా మారనుంది.
DMRC ప్రకారం, ఫేజ్ 5Aలో భాగంగా ఆర్కే ఆశ్రమ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు సెంట్రల్ విస్టా కారిడార్కు ఆమోదం లభించింది. ఈ దశలో మజెంటా లైన్ విస్తరణ ఉంటుంది. ప్రస్తుతం మజెంటా లైన్లో వచ్చే ప్రయాణికులు సెంట్రల్ సెక్రటేరియట్ చేరాలంటే మార్పిడి అవసరం. విస్తరణ తర్వాత మజెంటా లైన్ రైళ్లు నేరుగా ఈ స్టేషన్కు చేరడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ఇంటర్చేంజ్ స్టేషన్లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలు ప్రైవేట్ వాహనాలకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఎక్కువగా వినియోగించేలా చేయడమే లక్ష్యమని DMRC తెలిపింది. సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాంతంలో అనేక కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో రోజూ వేలాది మంది కార్లు, ద్విచక్ర వాహనాలతో రాకపోకలు సాగిస్తారు. మెట్రో సౌకర్యం విస్తరించడంతో ట్రాఫిక్ సాఫీగా నడవడంతో పాటు కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ మెట్రో నెట్వర్క్లో 29 ఇంటర్చేంజ్ స్టేషన్లు ఉన్నాయి. ఫేజ్ 4 పూర్తయితే ఈ సంఖ్య 43కు పెరుగుతుంది. ఫేజ్ 5A అమలుతో మొత్తం ఇంటర్చేంజ్ స్టేషన్ల సంఖ్య 46కు చేరనున్నట్లు DMRC వెల్లడించింది.
Also Read:సిట్ నోటీసులకు బదులిచ్చిన కేసీఆర్

