మిషన్ భగీరథలో జాప్యాన్ని సహించం: ఎర్రబెల్లి

494
errabelli dayakarrao
- Advertisement -

మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏ ఒక్క చిన్న పని సైతం పెండింగ్ లో ఉండవద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ తాగునీరు అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యాన్ని సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు.

వర్షాలతో అన్ని జిల్లాల్లోనూ జలవనరులు ఉన్నాయని, తాగునీటి సరఫరా సవ్యంగా నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కింద గ్రామాలలో చేపట్టిన అన్ని ట్యాంకుల నిర్మాణం సత్వరం పూర్తి కావాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా పైపులైన్ల ఏర్పాటు కోసం తవ్విన రోడ్ల మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి కావాలని ఆదేశించారు. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా తాను గ్రామాల్లో పర్యటిస్తున్నానని… మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అక్కడక్కడా అవాంతరాలు ఉన్నట్లుగా ప్రజలు చెబుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ కచ్చితంగా మంచి నీటి సరఫరా చేయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా…పనులు పూర్తి కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులకు స్పష్టం చేశారు.

కొందరు అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకపోవడం వల్ల పలు గ్రామాల్లో చిన్నస్థాయిలో సమస్యలు ఉన్నాయని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి అయినా పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనితీరు మెరుగ్గా ఉన్న వారిని గుర్తించి పనులు పూర్తయ్యేలా బాధ్యతలు అప్పగించాలని మిషన్ భగీరథ ఈ.ఎన్.సిని మంత్రి ఆదేశించారు. పీఎంజీఎస్వైలో ఉత్తమ గ్రామాలకు ప్రాధాన్యత… ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్ వై )లో భాగంగా రాష్ట్రానికి మంజూరైన 2400 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి దయాకర్ రావు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని మొత్తం 95 గ్రామీణ నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని… 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో ఉత్తమంగా పనితీరు ఉన్న గ్రామపంచాయతీలకు పీఎంజీఎస్వై ప్రతిపాదనలలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రతిపాదనల తయారీ పనులను వేగవంతం చేయాలని మంత్రి దయాకర్ రావు ఆదేశించారు.

- Advertisement -