మూడో టెస్టులో భారత్‌ ఓటమి..

144
- Advertisement -

లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 215/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఒక్క సెషన్‌లోనే మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. కేవలం 54 నిమిషాల్లో 7 వికెట్లు కోల్పోవడం విశేషం. ఓలీ రాబిన్‌సన్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. అతడికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. క్రెగ్ ఒవెర్టన్ కు 3 వికెట్లు, ఆండర్సన్ కు 1, మొయిన్ అలీకి 1 వికెట్ దక్కాయి.

భారత్ ఈ ఉదయం 215/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. నిన్నటి ఆటతీరునే కొనసాగిస్తారని భావించిన అభిమానులకు కొద్దిసేపట్లోనే ఆశాభంగం కలిగింది. కేవలం 63 పరుగుల తేడాతో మిగిలిన 8 వికెట్లు కోల్పోయిన భారత్… దిగ్భ్రాంతికర ఆటతీరుతో ఘోర పరాజయం చవిచూసింది. పుజారా, కోహ్లీ, రహానే, పంత్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. జడేజా (30) ధాటిగా ఆడినా అది కూడా కాసేపే అయింది. తన రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 278 పరుగుల వద్ద ముగించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్పకూలగా, ఇంగ్లండ్ 432 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా 354 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. అటు బౌలర్లు ఆండర్సన్, రాబిన్సన్, ఒవెర్టన్ కూడా సమష్టిగా సత్తా చాటి జట్టును గెలుపు దిశగా నడిపించారు.. ఇక, ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు సెప్టెంబరు 2 నుంచి లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో జరగనుంది.

- Advertisement -