జనసేనకు షాక్‌…గాజు గ్లాసు పోయింది!

183
ec
- Advertisement -

రాష్ట్రంలో జరగనున్న రెండు కార్పొరేషన్లు,ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేనకు షాక్ తగిలింది. జన సేన ఎన్నికల సింబల్ గాజు గ్లాసు గుర్తు కొల్పోయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గతేడాది జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని నేపథ్యంలో ఈ పార్టీలు కామన్‌ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు.

జనసేన (గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్‌ గుర్తులను కోల్పోయాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్‌ఈసీకి జనసేన లేఖ రాసింది. అయితే తాజాగా జరిగే ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తూ ఈసీకి లేఖ రాయగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు. దీంతో 2025 నవంబర్‌ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత లేదని స్పష్టం చేశారు.

- Advertisement -