అమెరికాలోని శ్వేతసౌధంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో అధ్యక్షుడు ట్రంప్.. భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. ఆ తర్వాత అధికారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ వేడుకల్లో ఐరాసకు అమెరికా రాయబారి నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పాయ్ తదితర భారత అమెరికన్లు పాల్గొన్నారు.
భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గోనడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. హిందూ మత విశ్వాసాలను నమ్మే భారతీయ ప్రజలను ప్రత్యేకంగా చూస్తామని ట్రంప్ అన్నారు. భారత్..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిందన్న ట్రంప్… ప్రధాని మోడీతో తనకు బలమైన బంధం ఉందన్నారు. అమెరికాలోనే సుమారు 20 లక్షల మంది భారతీయులు దీపావళి జరుపుకుంటున్నారన్నారు. బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తు చేశారు.
అమెరికా ప్రగతికి.. ప్రపంచానికి.. భారతసంతతీయులు విశేష తోడ్పాటు అందించారన్నారు. ఆర్ట్, సైన్స్, మెడిసిన్, బిజినెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో.. భారతీయులు అందించిన సేవలు.. అనితరసాధ్యమని ట్రంప్ అన్నారు. ఇండియన్ అమెరికన్ పౌరులకు అమెరికా చాలా రుణపడి ఉందని, వారందరికీ థ్యాంక్స్ అని ట్రంప్ తెలిపారు.
శ్వేతసౌధంలో దీపావళి వేడుకలను జరుపుకునే సాంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించారు. వైట్హౌజ్ కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న ఇండియన్ ట్రీట్ రూమ్లో ఆ వేడుకలను నిర్వహించేవారు. కానీ బుష్ ఎప్పుడూ నేరుగా వైట్హౌజ్లో దివాళీ సంబరాల్లో పాల్గొనలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా స్వయంగా సంబరాల్లో పాల్గొని దీపాలను వెలిగించారు.