లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ దేశంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత మరియు ద్వేషం పెరగడానికి నెతన్యాహు నిర్ణయాలే కారణమని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యల కారణంగా తాము వాషింగ్టన్తో జరుపుతున్న దౌత్యపరమైన చర్చలను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడుతూ ఒకానొక దశలో.. అసలు నువ్వు ఏం పాడు పని చేస్తున్నావు?…(What the f* are you doing?) అంటూ గట్టిగా అరిచారని ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా జరిపిన దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ స్పందిస్తున్న తీరు అత్యంత తీవ్రంగా ఉందని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా అధికారి తెలిపారు. కేవలం ఒక్క హెజ్బొల్లా కమాండర్ను లక్ష్యంగా చేసుకుని మొత్తం భవనాల్ని కూల్చివేయడాన్ని అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఆక్షేపించారు. అలాగే బీరూట్పై ఇజ్రాయెల్ చేస్తున్న తీవ్ర హెచ్చరికలను కూడా ఆయన తప్పుపట్టారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ జోక్యం వల్ల జరిగిన తక్షణ మార్పులను పంచుకున్నారు. బీరూట్పై పెద్ద ఎత్తున దాడులు చేయవద్దని తాను స్పష్టంగా కోరిన తర్వాత నెతన్యాహు తన సైన్యాన్ని వెనక్కి వచ్చేలా ఆదేశాలిచ్చారని ట్రంప్ ప్రకటించారు.
Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

