గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. అభివృద్ది కార్యక్రమాలను మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని, అవి సక్రమంగా అమలై ప్రజలకు ఉపయోగపడేలా చేసే బాధ్యత స్వీకరించాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై జనహితలో సోమవారం ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం, ప్రజారోగ్యం, విద్యా సంస్థల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణం, వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, డబుల్ టెడ్ రూమ్ ఇండ్ల పథకం, వ్యవసాయ సంబంధ అంశాలపై సమీక్ష జరిగింది. గ్రామస్థాయిలో తలెత్తే సమస్యలను సిఎం ఓపిగ్గా విన్నారు. అప్పటికప్పుడే పరిష్కారం చేశారు. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారం బాధ్యతలను శాఖల వారీగా అధికారులకు అప్పగించారు.
“మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి మంచినీళ్లు వస్తున్నాయి. ప్రతీ గ్రామానికి నీళ్లు అందుతున్నాయి. ఊరికి దూరంగా ఉన్న ఇండ్లకూ, ఎత్తు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లకూ నీరందించాలి. ప్రతీ ఇంటికి ప్రతీ రోజు నీరు రావాలి. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి. అన్ని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం కోసం సబ్ స్టేషన్లు నిర్మించాం. ట్రాన్స్ పార్మర్లు ఇస్తున్నాం. ఇంకా విద్యుత్ సరపురాలో ఎమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని సూచించారు.

గజ్వేల్ నియోజకవర్గంలో పవర్ డే నిర్వహించాలి. వంగిన పోళ్లను సరిచేసుకోవాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. నియోజకవర్గంలో ప్రతీ ఇంటిలో మరుగు దొడ్డి నిర్మించారు. కాని అందరూ వాడడం లేదు. వాటిని సంపూర్ణంగా వినియోగించాలి. వరంగల్ రూరల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో ప్రజలు 25 కమిటీలు వేసుకుని వారి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆ గ్రామంలో పర్యటించండి. చూసి నేర్చుకోండి. ప్రతీ గ్రామంలో స్మశాన వాటిక నిర్మించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన రహదారుల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలి. అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలి” అని సిఎం చెప్పారు.

