ప్రధానమంత్రి మోడీపై ఎమ్మెల్యే బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను ప్రధానమంత్రి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని, రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు గుంటూరు చిలకలూరి పేటలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ ఈ విధంగా వివరణ ఇచ్చారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన 12 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్నబాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహరంపై బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముందు ఆందోళన చేశారు.
మరోవైపు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదంపై స్పందించారు బాలకృష్ణ. ఈ విషయంలో పెద్దలు కూర్చొని మాట్లాడడం మంచిదన్నారు బాలయ్య. నేటితో జైసింహా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకటూరిపేట రామకృష్ణ థియేటర్లో ‘జై సింహా శతదినోత్సవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ మూవీని సీకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్ నిర్మించారు. ఇందులో నయనతార కథానాయికగా చేసిన సంగతి తెలిసిందే.