రాష్ట్రమంతా దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే హుజురాబాద్తో పాటు పలు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకాగా ఇప్పుడు మిగిలిన 118 నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
నియోజకవర్గానికి 100 కుటుంబాలు చొప్పున ఒక్కొక్కరికి రూ.10లక్షల యూనిట్లు మంజూరు చేయనుంది. నూతన సంవత్సర కానుకగా జనవరి నుంచి అబ్ధిదారులను గుర్తించి, మార్చి నాటికి యూనిట్లు ఏర్పాటయ్యేలా నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
దళితబంధు అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో రెండు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గానికి 100 మందిని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేయాలా? లేదా వంద కుటుంబాలు వచ్చేలా ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేసి దళితబంధు ఆదర్శ గ్రామాల కింద ప్రకటించి అమలు చేయాలా?అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

