శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..

114
- Advertisement -

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీవర్గాల్లో సంచలనంగా మారింది. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో బీజేపీ సీనియ‌ర్ నేత, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి పాత్ర‌తో పాటు ఆ పార్టీకి చెందిన మహిళా నేత‌ డీకే అరుణ పాత్ర‌పైనా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌కు సంబంధించిన వివ‌రాలు మీడియాకు తెలిపారు.

‘ఫిబ్రవరి 23న ఫరూక్‌, హైదర్‌ అలీ సుచిత్ర వద్ద ఒక లాడ్జిలో ఉన్నారు. 25న ఇద్దరు బయటకు టీ తాగేందుకు వెళ్లినప్పుడు నాగరాజు, కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని వెంబడించి చంపడానికి ప్రయత్నించారు. తర్వాత ఫరూక్‌, హైదర్‌ అలీ తప్పించుకున్నారు. 5 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్‌బషీర్‌బాద్‌ పోలీసులు సెక్షన్‌ 307, 120బీ, 115 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 25 ఏబీ ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద ఒక కేసు నమోదు చేసి విచారణ చేశాం.

ఈ విచారణలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ అనే ముగ్గురు మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చి కొంపల్లి ఏరియాలోని సుచిత్రలో వీరిని వెంబడించి దాడికి చేసేందుకు యత్నించారు. ఇద్దరు తప్పించుకున్న తర్వాత ముగ్గురు అదే ప్రాంతంలో కొన్ని లాడ్జీల్లో వెతికారు. వీరిని 26న అరెస్ట్‌ చేశాం. 27న జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి.. నాగరాజు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో కొన్ని విషయాలు చెప్పాడు. రాఘవేంద్ర రాజు, కొందరితో కలిసి హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. ఆ తర్వాత విచారణ జరుపగా రాఘవేందర్‌ రాజు, మున్నూర్‌ రవి, మధుసూదన్‌ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది.

అయితే, వీరికి గురించి సమాచారం రాలేదు.. వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. ఈ సందర్భంగా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. రాఘవేందర్‌ రాజు, రవి, మధుసూదన్‌, అమరేందర్‌ కలిసి మహబూబ్‌నగర్‌ నుంచి వైజాగ్‌ వెళ్లి.. అక్కడి ఢిల్లీకి వెళ్లి షెల్టర్‌ తీసుకున్నారు. వీరికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌, పీఏ రాజు అని విచారణలో తేలింది. వీళ్లందరిని సర్వెంట్‌ క్వార్టర్స్‌లో నోటీసులు ఇచ్చి.. అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. వారిని ప్రశ్నించగా.. కుట్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలను రికవరీ చేశాం. రాఘవేందర్‌ రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్‌.. దుండిగల్‌ ఫారెస్ట్‌ ఏరియాలో 6 రౌండ్స్‌ రివాల్వర్‌ రాజు నుంచి రికవరీ చేసి.. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించాం.

రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా.. కేబినెట్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలింది. కేసు వివరాల్లోకి వెళితే.. రాఘవేందర్‌ రాజు మొదటి ఫరూక్‌ను కలిశాడు. ఫరూక్‌ కూడా నేర చరిత్ర ఉన్నది. మంత్రిని హత్య చేయాలని.. నువ్వు చేసినా సరే.. వేరే ఎవరినా కలిపిస్తే వారితో చేయిస్తామని ప్రణాళిక వేశారు. హత్య కోసం రూ.15కోట్ల వరకు సుపారీ ఇవ్వచూపారు. హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశాం. కుట్రలో రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేందర్‌ రాజు, మధుసూదన్‌, షెల్టర్‌ ఇచ్చిన వ్యక్తితో మరో ముగ్గురు కలిసినట్లు విచారణలో తెలిసింది. హత్య కేసుకు ప్రధాన సూత్రధారులు మధుసూదన్‌, అమరేందర్‌రాజు అని, హత్య కోసం రూ.15కోట్లు సుపారీ ఇవ్వజూపారు. నిందితులను రిమాండ్‌కు తరలించాం. పోలీసు కస్టడీలోకి నిందితులను తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం’ అని వివరించారు.

కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జితేందర్‌రెడ్డి.. పీఏ రాజు, డ్రైవర్‌ థాప, సౌత్‌ అవెన్యూలోనే షెల్టర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. ఆయుధాలను రాజు యూపీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందని, పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై.. నాగరాజు అరెస్టయిన తర్వాత హత్య కేసు, నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

- Advertisement -