కాంగ్రెస్ కు షాక్..టీఆర్ఎస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

248
atramsakku
- Advertisement -

త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచే సత్తా తమకుందని అన్నారు.

తాము సీఎం కేసీఆర్ ను కలిశామని, ఎస్టీలు, ఆదివాసీల సమస్యలను ఆయన ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. పోడు భూముల సమస్యలు, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, గిరిజన, ఆదివాసీలను ఉపాధి కల్పించాలని కోరగా, ఆయన స్పష్టమైన హామీలు ఇచ్చారని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని ఎన్నో పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతో పాటు ఇతర అంశాలను సీఎం కేసీఆర్‌తో చర్చించాం. ఆదివాసీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్ కు 91మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎంఐఎం పార్టీకి చెందిన వారు 7గురు ఉన్నారు. మొత్తం కలిపి 98మంది ఉన్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్ధానాలకు 100మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండటంతో ఇప్పడు కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్న ఇద్దరూ ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్ఎస్ బలం 100కు చేరనుంది.

- Advertisement -